వీర బొబ్బిలి

ఒక అద్భుతమైన పుస్తకం అనుకోకుండా మీ చేతిలోకి వస్తే ఎలా ఉంటుంది!!! ఎప్పుడో చదువుకున్న ఒకానొక కధ... చిన్నప్పడు పుస్తకంలో దాచుకుని పోగొట్టుకున్న నెమలి ఈకలాంటి అందమైన జ్ఞాపకంలా, ఆ రచయిత పేరు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆ కధ, మలుపులూ గుర్తొచ్చి మన కళ్ళు.. తప్పిపోయిన ఆత్మీయుని చిరునామాలా...వెతుక్కుంటామే...
అంతగా వెతుకుతున్న పుస్తకం అయితే...
ఆ ఆనందం ఎలా ఉంటుంది!!
ఎలా ఉంటుందంటే...
కొత్తగా ముస్తాబయి వచ్చిన "కె.ఎన్.వై.పతంజలి " నవలా సంపుటంలా ఉంటుంది. ఇందులో ఒక పెద్ద కధ "వీర బొబ్బిలి" .. బొబ్బిలి అలమండ రాజు గారి దివాణం లో జాతికుక్క గారి పేరు. మనం కుక్క అన్నామని తెలిస్తే అది డీప్‌గా హర్ట్ అవుతుంది. అందుకని " బొబ్బిలి" అనే పిలిచుకోవాలి. ఇంక దాని భేషజాలు, ఆర్భాటాలూ అనీ ఇన్నీ కావు. 
"కుక్కలకు మాత్రం నీతి ఉండక్కరలేదనుకున్నావా పాత్రుడూ?... ఫలానీ రాజు ఫలానీ కుక్కని పెంచి చెడిపోయాడని జనం చెప్పుకుంటే, లోకంలో కుక్కలన్నింటికీ మచ్చకాదా..." అని బొబ్బిలి గారు బాధ పడుతుంటే చిన్నప్పుడు చదివి పడీ పడీ నవ్వుకునే వాళ్ళం.. అప్పట్లో పుస్తకాలు ఇంత జాగ్రత్తగా దాచుకోవాలన్న ధ్యాస లేదు.
బొబ్బిలి వేటకుక్క. అందుకే దివాణానికి అది కాపలా కాయదు. కావలి కుక్కలతో అవి జాతితక్కువ అనుకుంటుంది కాబట్టి కలవదు. అర్ధరాత్రి దివాణంలోకి దొంగ వస్తే వాడికి దారిచూపించి, వంటగదిలో దాచుకున్న అన్నం కూర చూపించి అందులో తన వాటా అడిగి మరీ తింటుంది. " ఇదే నేను కాపలా కుక్కనైతే నీ పిక్క పట్టుకుని కరిసేద్దును. నేను వేటకుక్కని కాబట్టి నువ్వు బతికిపోయావు." అని పైగా తన తెలివి తెటల్ని గొప్పగా ప్రదర్శించుకుంటుంది. 
అస్సలు లౌక్యం అంటే తెలుసు కోవాలంటే బొబిలి దగ్గరే నేర్చుకోవాలి.. 
విశ్వాసం ముఖ్యమా.. బోయనం ముఖ్యమా అన్న సమస్య వచ్చినప్పుడు.. "ఇప్పుడు నాకు ఆకలి వేస్తోంది కాబట్టి బోయనం ముఖ్యం. బోయనం చేసాక, మళ్ళీ ఆకలి వేసేవరకూ మాత్రం విశ్వాసమే ముఖ్యం.." అని చాలా ఖచ్చితంగా మనం కన్విన్స్ అయ్యేటట్లు చెప్తుంది.
"వీర బొబ్బిలి" చదివాక ఏ శునక రాజుని చూసినా దాని భాష మనకి అర్ధం అయిపోయినట్లే అనిపిస్తుంది. శ్రీమంతుల ఇంట్లో కట్టేసిన జాతి శునకాల గొప్పలయితే మరీ అర్ధం అయిపోతాయి.
సాహిత్య ప్రేమికులకి పతంజలిగారి గురించి చెప్పాలనుకోవడం సాహసమేనేమో.
పతంజలి నవలా సంపుటం, కధల సంపుటం "మనసు ఫౌండేషన్" పుణ్యమాని ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చాయి. ఆయన రచనల్లో సునిశితంగా ఉండే హాస్యం, వ్యంగ్యం మన మనసుల్ని సూటిగా తాకుతాయి. సాహిత్యంలో పతంజలి స్పృశించని ప్రక్రియ లేదు. ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలయిన శాసనవ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, పత్రికా వ్యవస్థని ఏకరీతిలో తన పదునైన వ్యంగ్యంతో ఎండగట్టి చీల్చి చెండడారు.
"పేరు రావాలని నేను రచనలు చేయలేదు.
చెడుని దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తే నాకు సంతోషం.
అన్యాయాన్ని బజారు కీడిస్తే ఆనందం"
అంటారాయన. నిజమే పతంజలి అన్నట్లు పేరు వేరు, యశస్సు వేరు. పతంజలి గారికున్న యశస్సు ఎవరికి లభిస్తుంది!!

No comments