నాలో నేను


శరత్ కాలపు చల్లని సుప్రభాత వేళ
కిటికీని దాటొచ్చిన కిరణమొకటి
నులి వెచ్చని రహస్యాన్ని చెప్తోంది.
కిటికీ అవతల పారిజాతం క్రీగంట కనిపెడుతోంది.
రావి చెట్టుపై మైనా ఏకాగ్రతగా నా వైపు చూస్తోంది.
లేత ఎరుపు ఆవేశాన్ని వొంటినిండా కప్పుకుని
నాకు ఆలోచనల మంటనంటించడానికన్నట్లు
సూరీడు మంచుతో యుద్ధం చేస్తున్నట్లుంది..
నిశ్శబ్దం చేసే శబ్దంతో హృదయం కలసిన స్పందనని ఆలకిస్తూ
ఒంటరిగా నా గదిలో మేల్కొని మనసుని ఇలా పరచుకుంటున్నప్పుడల్లా
నాలోపల ఎవరో చప్పున ఇటువైపునుండి అటువైపు కదులుతూ..
జీవితకాలపు జ్ఞాపకాలని ఆనవాలుగా వదులుతున్న సవ్వడి..
ఎవరో నవ్వుని నొక్కిపెట్టిన ధ్వని,
మనసుని కలచి వేసినట్లు..
మాటల మీద మౌనం కప్పినట్లు,
ఒక నిర్వేదాన్నికళ్ళ మీద పోతపోస్తూ..
మంచూ మసక వెన్నెలా కలసిన
సుప్రభాత వేకువ మీద
మరకలా పడుతుంది నా నిట్టూర్పు.
ఎందుకు రాస్తున్నావంటే ఏం చెప్పను?
ఎవరి గురించి అంటే.. అసలెలా చెప్పనూ..
ఇంతకూ నే చెప్పాల్సింది ఎవరికీ అన్న ప్రశ్న
మొదలవకుండా మనసునెలా ఉగ్గబట్టుకోను?
మాట్లాడటానికి కలసి రాలేదనేమో
మైనా విసుగ్గా వెళ్ళిపోయింది.
సూరీడు కూడా అంత ఎత్తుకు చేరిపోయాక
చుట్టూ ఉన్న మంచు తెరలు విడిపోయాక
వచ్చిందిపుడు నిజమైన మెలకువ !!!
కిటికీలోనుండి నులివెచ్చటి గాలి
కిల కిలా నవ్వింది...
ఇక నీకోసమే నువ్వంటూ...
గుసగుస లాడింది..

No comments