పాపిలాన్‌ – హెన్రీ చార్రియర్‌



కొన్ని నవలలు చదవడానికి చాలా బాగుంటాయి. పుస్తకం కింద పెట్టకుండా చదివించగల శక్తి వాటికి ఉంటుంది. కానీ పరిచయం చేయాలంటే కథాభాగం చేతికి దొరకదు. చాలా చాలా తిప్పలు పెడుతుంది. పాపిలాన్‌ కూడా అలాంటిదే. పాపిలాన్‌ అంటే సీతాకోక చిలుకని అర్థం. హెన్రీ తన గుండెల మీద సీతాకోకచిలుకని పచ్చబొట్టుగా పొడిపించుకోవడం చేత అందరూ అతనిని పాపిలాన్‌ అని పిలుస్తారు. అతని సాహసిక గాథే ఈ నవల.
పాపిలాన్‌ నవల రాయడానికి ప్రేరణ అంతకు ముందు ఫ్రెంచ్‌ రచయిత ఆల్‌ బరయిన్‌ సిర్రాజన్‌ రాసిన యదార్థ గాథ అని హెన్రీ తన ముందు మాటలో చెపుతాడు. ఫ్రాన్స్‌లో అట్టడుగు జీవితం, నేరస్థురాలిగా ఆమె అనుభవాలు ఉన్న ఈ నవల దాదాపు 123 సార్లు పునర్ముద్రింపబడిందన్న వార్త చదివిన ఛార్రియర్‌ తన జీవితంతో పోలిస్తే సిర్రాజన్‌ జీవితం అంత గొప్పదేం కాదని తలుచుకొని మొదలు పెట్టానని అంటాడు.
ఈ నవల ఫ్రెంచ్‌ రచనా విధానంలో గొప్ప మార్పు తీసుకు వచ్చింది. ఇది ఒక ఆజన్మాంతర జీవిత ఖైదీ జీవిత గాధే కాదు, మనకి తెలియని ఒక కొత్త ప్రపంచపు లోతుల గురించిన కథ. మానవులలోని మహోన్నతమైన స్వేచ్ఛా ప్రయత్నానికీ, మనిషిలోని అత్యున్నత వాదానికీ ఇది ఒక ప్రతీక. దొంగలు, ఖూనీ కోర్లు, పచ్చి నెత్తురు తాగే ఈ జంతు సాదృశ్యులలో కూడా ఒక ఆదర్శం, మహోన్నతమైన ఏకాభిప్రాయం, తమకి లభ్యం కాని స్వేచ్ఛ కొరకై తోటి ఖైదీ ప్రయత్నిస్తున్నప్పుడు అందరూ ఒక్కటై ఏకతాటిమీద నడచి మనస్ఫూర్తిగా సహాయం చేయడం, ఇటువంటి అపూర్వమైన మనస్తత్వాలు ఈనాటి సమాజంలో కనిపించవు. అట్టడుగుకి జారిపోయి, పతనమై పోయాడనుకున్న మనిషి ఎంత ఉన్నతంగా దైవత్వానికి దగ్గరగా ఎలా రాగలడో చెపుతాడు హెన్రీ.
హెన్రీ చార్రియర్‌ ఒక బీద కుటుంబంలో పుడతాడు. తండ్రి స్కూల్‌ మాస్టరు. బాల్యంలోనే తల్లిని కోల్పోయిన హెన్రీ కొన్నాళ్ళు నౌకా దళంలో పనిచేసి, ఆ తరువాత చిన్న చిన్న దొంగతనాలకి, మాదక ద్రవ్యాల వ్యాపారానికి ఆలవాలమైన పారిస్‌లో, అక్కడి నేరస్తుల ప్రపంచంలో ఒకనిగా చెలామణి అవుతూ ఉంటాడు. అయితే అతను పోలీసులకి ఎప్పుడూ పట్టుబడడు. అలాంటి పరిస్థితులలో ఒకసారి హెన్రీ తాను చేయని హత్యానేరానికి అరెస్టు అవుతాడు. విచారణానంతరం యావజ్జీవ ఖైదు విధిస్తారు. అప్పటి ఫ్రాన్స్‌ చట్టం ప్రకారం యావజ్జీవ శిక్ష అంటే ద్వీపాంతర వాసం.
మనదేశంలో బ్రిటిష్‌ కాలంలో యావజ్జీవఖైదీలను అండమాన్‌ ద్వీపానికి పంపేవారు. అలాగే అప్పటి ఫ్రెంచ్‌ చట్టాల ప్రకారం సెయింట్‌ లారెంట్‌ దీవులకి పంపేవారు. అలా… ఫ్రాన్సు నుండి 18 రోజుల పాటు సముద్రయానం చేసి సెయింట్‌ లారెంట్‌ చేరుకుంటాడు హెన్రీ. బురదలో, రోగాలతో, అధికమైన దైహిక శ్రమతో ద్వీపాంతర వాస శిక్ష పొందిన నేరస్థులు నూటికి ఎనభై మంది చనిపోతుంటారు. అటువంటి నికృష్టమైన స్థలానికి తాను చేయని హత్యకి శిక్షగా ఆజన్మాంతర ఖైదీగా పంపబడతాడు హెన్రీ.
పాపిలాన్‌ మామూలు రూళ్ళ పుస్తకం మీద రాయటం మొదలు పెట్టి 13 పుస్తకాలలో అతి వేగమైన రచనా రీతిలో తన సాహసానుభవన్నాంతా పొందు పరిచాడు. రోజుకి 5 వేల మాటలు రాసానని అతను తన ముందు మాటలో చెపుతాడు. అంటే అతను మామూలు ఖైదీగా, గొప్ప రచయితగా కంటే ఒక మానసిక తపన ఉన్నవాడని మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో న్యాయం, చట్టం ఎంత నేత్రవిహీనమైనవో చెప్పాలన్న భావావేశం, ప్రవాహ వేగం మనకి ఈ పుస్తకంలో అణువణువునా కనిపిస్తుంది.
ఖైదు విధించే సమయానికి హెన్రీ వయస్సు పాతికేళ్ళు. జీవితమంతా ముందు ఉంది అతనికి. కానీ కళ్ళు లేని న్యాయం ప్రాణం ఉన్న వ్యక్తి ఉనికిని సంఖ్యాపరంగా మార్చేసి పూర్తిగా చరిత్రహీనుడిని చేయబోతున్నది. అలాంటి పరిస్థితులల్లో బయటనుండి హెన్రీ స్నేహితులు రహస్యంగా చిన్న రొట్టె ముక్కలతో పాటు కొంత డబ్బు పంపుతారు. చిమ్మచీకటిలో కాంతి రేఖ!! అయితే ఆ డబ్బు ఎలా దాచడం?
ఖైదీలను పూర్తిగా బట్టలు విప్పించి దేహంలోని ప్రతీభాగం వెతుకుతారు వార్డన్లు. చివరికి పెన్సిల్‌ వంటి ఒక గొట్టం దొరుకుతుంది హెన్రీకి. దానిలో చుట్టచుట్టి డబ్బుదాచి ఆ గొట్టాన్ని ఆసనం ద్వారా లోపలికి తోసి బయటికి రాకుండా బిగపట్టుకుని గడుపుతాడు హెన్రీ.
నవల నిండా స్వేచ్ఛా వాయువులు పీల్చడం కోసం ప్రతీ ఖైదీ పడే ఇలాంటి తపనలే. చదువుతుంటే బాధ, దుఃఖం, అసహ్యం, వేదన కలగలిపి మనల్ని కుదిపేస్తాయి. కొత్తనోట్లతో బయట ప్రపంచ రహస్య రాయబారంతో పాపిలాన్‌కి కొంత ధైర్యం వస్తుంది. అతనిలో స్వేచ్ఛా వాయువులు రాజుకుంటాయి. ఎలాగయినా తప్పించుకో వాలన్న తపన అతనిని నిలువనీయదు. రెండు మూడు ప్రయత్నాలు చేసి బాగా దెబ్బలు తిని ఏకాంతవాడలో, నరసంచారం కళ్ళబడ కుండా కనీసం వంటిమీద బట్టలు కూడా లేకుండా రెండు చేతులు వెనక్కి విరిచి కట్టబడి వారం రోజులు శిక్ష అనుభవిస్తాడు హెన్రీ.
కొన్ని ప్రయత్నాల తరువాత… హాస్పిటల్‌లో చేరితే తప్పించు కోవటానికి వీలు పడుతుందని ఒక ఖైదీ చెప్పిన సలహా నచ్చుతుంది. పాపిలాన్‌కి మోకాలి చిప్పపై కత్తితో గాయం చేసుకుని సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ పోసుకుని గాయంతో ఆసుపత్రిలో చేరతాడు పాపిలాన్‌.
అక్కడినుంచి పాపిలాన్‌ తప్పించుకుని బెల్జియం పారిపో తాడు. కథ అనేక మలుపులు తిరిగిన తర్వాత బెల్జియం అధికారులకు పట్టుబడి రెండేళ్ళు ఏకాంత వాసం అనే శిక్షపడుతుంది హెన్రీకి. రెండేళ్ళు ఏకాంత వాసం, ఎవరితోనూ మాట్లాడకుండా, మరో మనిషి ముఖం చూడకుండా కేవలం ఆహారం ఇచ్చే జైలు ఉద్యోగి తప్ప నరసంచారం లేని పాతాళ గృహంలో బంధించబడటం. ఇలా ఒక ద్వీపంలో ఏకాంత వాసంలో ఉంచబడిన ఖైదీలు బ్రతికి బయట పడడం అంతవరకూ జరగలేదు. బయట పడినా పిచ్చి ఎక్కడమో నడవలేని స్థితికి రావడమో జరుగుతుంది.
అలాంటి శిక్ష అనుభవించిన పాపిలాన్‌ పట్ల మనకి జాలి, స్వేచ్ఛ కోసం తిరిగి తిరిగి ప్రయత్నించే అతని సాహసం పట్ల గౌరవం, అతని మానసికమైన పట్టుదల పట్ల అడ్మిరేషన్‌ మనల్ని ముంచేస్తాయి. అక్కడినించి ఎలాగో తప్పించుకుని బ్రిటిష్‌ గయానా లోని జార్జిటౌన్‌ అధికారులకి చిక్కిన పాపిలాన్‌ని, అక్కడి అధికారులు శిక్షించరు. అతను ఫ్రెంచి పౌరుడు. శరణాగతుడై వచ్చాడు. అతనికి స్వేచ్ఛని, పౌరసత్వపు హక్కుని ఇవ్వగల అధికారం ఉంది. అతనిని క్షమించి పౌరసత్వం ఇస్తారు. అక్కడి నుంచి వెనిజులా చేరుకున్న పాపిలాన్‌ స్వేచ్ఛా మానవునిగా పెళ్ళి చేసుకుని పిల్లల్తో కొత్త జీవితాన్ని ఆరంభిస్తాడు. 11 సంవత్సరాల పాటు పోరాడి పోరాడి పొందిన స్వాతంత్య్రమది. కథ మొత్తం ఖైదీలు ఒకరికొకరు సహాయపడడం భలేగా ఉంటుంది.
”మనిషిని మనిషిగా బ్రతకనివ్వని సమాజమూ, ప్రభు త్వమూ ఇవి కావు నాగరికతకు చిహ్నాలు, మానవులలోని అత్యున్నత మయిన దయ, జాలి, ఐకమత్యం ఇవన్నీ చూడాలి అంటే, సమాజం లోని అట్టడుగున ఉన్న నేరస్థులని, సమాజం నుంచి దూరంగా విసిరివేయబడ్డ ఖైదీలను వెతకండి. అక్కడ కనిపిస్తాయి మనిషిలోని ఉత్తమ గుణాలు, ఏకభావమూ” అంటాడు పాపిలాన్‌. అందుకు
ఉదాహరణే ఈ సాహసిక గాథ.

No comments