మ్యారీడ్ టు భూటాన్ - లిండా లీమింగ్

"పిట్టకొంచెం - కూత ఘనం" అన్న సామెత మన పొరుగున ఉన్న బుల్లి దేశం భూటాన్ కి అక్షరాలా సరిపోతుంది. కేవలం యేడు లక్షల జనాభా కల చిన్న రాజ్యం , ఆనందం అంటే ఏమిటో  దానిని ఎలా  సాధించాలో,   న్యూయార్క్ లోని ఐక్య రాజ్య సమితి వేదిక పైనించి ప్రపంచ దేశాలకు విడమర్చి చెప్పింది.  ప్రజలు మేరకు ఆనందం గా ఉన్నరన్నదాన్ని బట్టి జాతి ప్రగతిని బేరీజు వేస్తున్న ఏకైక దేశం అదే మరి.  ప్రపంచం లోని పెద్ద పెద్ద దేశాలన్నీ తమ విధ్వంశకర ఆర్ధిక పోకడలతో సామాజిక పర్యావరణ వ్యవస్థలను చిన్నా భిన్నం చేస్తూ మనిషి మనుగడనే ప్రశ్నార్ధకం చేస్తున్న పరిస్థితి మన కళ్ళకు కనిపిస్తోంది. మరో వైపు ప్రజలను సంతోషం గా ఉంచడమే ఆర్ధిక విధాన అంతిమ లక్ష్యమని చాటి చెప్పి, ఆచరణలో దానిని సాధ్యం చేసిన ఏకైక దేశం భూటాన్. భూటాన్ దేశాన్నీ , అక్కడ ప్రజల జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్టు వివరించే నవల నెల మీకు పరిచయం చేయబోతున్న "మ్యారీడ్ టు భూటాన్"  పుస్తకం. రచయిత పేరు "లిండా లీమింగ్.

మొదటి సారి 1994 లో స్నేహితులతో కలిసి ఇండియా యూరోప్ పర్యటనకు వస్తారు లిండా. స్నేహితుల బలవంతం తో పదిహేను రోజులు భూటాన్ లో పర్యటిస్తారు ఆమె.  పదిహేను రోజుల భూటాన్ పర్యటనా, ప్రత్యేకం దేశంలోని  "పునాకా" అనే ప్రదేశం,   తన జీవితాన్ని మార్చేసింది అంటారామె. భూటాన్ దేశ ప్రజల జీవిన విధానం పట్ల విపరీతం గా ఆకర్షింప బడిన ఆమె1995 లో మరలా దేశానికి వచ్చి భూటాన్ దేశ నలుమూలలా పర్యటిస్తారు. అవన్నీ మన కళ్ళకు కట్టినట్టు వివరిస్తారు లిండా లీమింగ్.  భూటాన్ లో నే స్థిరపడాలని నిర్ణయించుకున్న ఆమె  ఒక ఆర్ట్ స్కూల్లో  టీచర్ గా చేరుతుంది. అదే స్కూల్లో పని చేస్తున్న తోటి టీచర్ని వివాహం చేసుకుంటుంది. విభిన్న పరిస్థితుల మధ్య,  భిన్న ధృవాల్లాంటి జీవితాలు వైవాహిక జీవితం లో ఎదుర్కొన్న గమ్మత్తు అనుభవాలు, చిన్న చిన్న సంక్షోభాలూ , ఇవన్ని అత్యంత సహజంగా వివరిస్తారు లిండా. 



సూక్ష్మం గా చెప్పాలంటే ఇదీ కధ.  ఐతే అంతర్లీనంగా పుస్తకమంతా భూటాన్ దేశ ఆర్ధిక,సాంఘిక,  సాంస్కృతిక  స్థితిగతుల వర్ణన తో నింపేస్తారు లిండా లీమింగ్. ఇప్పటికీ భూటానీయుల  తలసరి ఆదాయం నెలకు  110 డాలర్లు. అంటే దాదాపు ఏడున్నరవేల  రూపాయలే.  ఐనప్పటికీ అనవసర భేషజాలకు పోకుండా వారు ఒక ప్రణాళిక ప్రకారం బ్రతుకుతారు. భూటాన్ ఆసియాలోనే అత్యంత ఆనందమయ దేశమనీ, ప్రపంచంలోని మొదటి ఎనిమిది  అత్యంత ఆనందమయ దేశాలలో ఒకటనీ "బిజినెస్ వీక్" పత్రిక కితాబునిచ్చింది. దేశ ప్రజానీకం చాలావరకూ సుఖ సంతోషాలతోనే బ్రతుకున్నారన్నదానికి నిదర్శనమిది. బౌధ్ధ మత అధ్యాత్మికతనూ ప్రజల బాగోగులే ప్రాతిపదిక గా కలిగిన మౌలిక అర్ధ సూత్రాలతో సంధానించి రూపొందించిన "స్థూల జాతీయ ఆనందం" అనే అభివృద్ధి అనే నమూనా వల్లే భూటాన్ ఘనత సాధించగలిగింది. సుస్థిర న్యాయబధ్ధ సామాజిక ఆర్ధిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ , సంస్కృతి సాంప్రదాయాల రక్షణ-అభివృధ్ధి , సుపరిపాలన అన్నవి భూటాన్ యొక్క " గ్రాస్ నేషనల్ హ్యపీనెస్(జి.ఎన్.హెచ్) నమూనా కు మూలాధారాలు.

ముప్పై మూడు సూచికల ఆధారం గా జనజీవితాలని అంచనా వేసి, తదనుగుణమైన అభివృధ్ధి పధకాలను రూపొందిస్తోంది భూటాన్.  వృధ్ధిరేటూ, స్థూల దేశీయోత్పత్తీ వంటివేవీ ప్రజల జీవన స్థితిగతులను మార్చలేని పరిస్థితులలో సరికొత్త యోచన ద్వారా పరివర్తనకు తెరచాపలెత్తిన దేశమిది. నమూనా ఎవరికయినా అనుసరణీయమే. కానీ అందుకు కావలసిన చిత్తశుద్ధి ఎవరికైనా ఉన్నదా అన్నదే అనుమానం. ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ గా ఉన్న భారత్ పట్టపగ్గాల్లేకుండా ప్రగతి పథం లో దూసుకెళ్తోందనీ, 2050 సంవత్సరం నాటికి అగ్ర ఆర్ధిక వ్యవస్థ గా ఆవిర్భవిస్తుందనీ , ఒక అంతర్జాతీయ నివేదిక ఇటీవల ఒక ఆశావహ దృశ్యాన్ని ఆవిష్కరించింది.  అభివృద్ధి ఫలాలు నిజంగా అట్టడుగు   స్థాయి ప్రజానీకానికి అందుతున్నాయా? వారి ఆకలి దప్పులు తీరుస్తున్నాయా?  అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. మానవాభివృద్ధి సూచీలో ఉన్న 187 దేశాలలో భారత్ ది 134 స్థానం.విద్య, ప్రజారోగ్యం,ఆదాయాలను పరిగణన లోకి తీసుకుని రూపొందించిన సూచీ, దేశం లోని వాస్తవ పరిస్థితులకు అద్దంబడుతోంది.  నేటికీ 70శాతం ప్రజలు పేదలేనని సోనియా గాంధీ సారధ్యంలోని జాతీయ సలహా మండలి సభ్యుడు శ్రీ ఎస్.సి.సక్సేనా చేసిన వ్యాఖ్యలను తేలికగా తీసిపారేయలేము. జనాభా గణాంకాల ప్రకారం మన దేశంలో కనీసం 20 శాతం మందికి సొంత ఇళ్ళు లేవు. దాదాపు అంతే మొత్తం ప్రజలకు రేడియో, టీవీ, వంటి సౌకర్యాలు కూడా కరువు. సగానికి పైగా కుటుంబాలకు రక్షిత తాగునీరు, మరుగు దొడ్డి సదుపాయాలు అందుబాటులో లేవు.,మనిషి ఆనందం గా బ్రతకడానికి కావలసిన ఒక్క సదుపాయాన్నీ మన ప్రభుత్వాలు అందించలేకపోతున్నాయి.ఒక్క మాటలో చెప్పాలంటె ఇక్కడి జనజీవితాలు ప్లాస్టిక్ పూల మాదిరిగా తయారయ్యాయి.  స్వార్ధమే పరమావధిగా కల నాయకులు గుర్రపు డెక్కల్లా విస్తరిస్తున్న కొలదీ జనం బతుకులు కుంచించుకు పోతూనే ఉంటాయి. పెద్ద పెద్ద పధకాలు వేసే మన నాయకులకు భూటాన్ వంటి అతి చిన్న దేశం కానీ , అక్కడి అభివృద్ధి గానీ అసలు కంటికి ఆనుతుందా?  ప్రజ మొహాలు స్వఛ్చమైన చిరునవ్వుతో ఎప్పటికైనా విప్పారుతాయా ? 

మ్యారీడ్ టు భూటాన్ పుస్తకం చదువుతున్నంత సేపూ ఇవే ప్రశ్నలు మన మనసు లో మెదులుతూ ఉంటాయి.భూటాన్ దేశ నాలుగో రాజు " జిగ్మే సింగ్లే వాంగ్ చుక్"  నాలుగు దశాబ్దాల క్రితం అంటే 1972 లో " స్థూల జాతీయ అనందం" అనే ప్రతిపాదన ముందుకు తెచ్చారు.  స్థూల దేశీయోత్పత్తి స్థానే దాన్ని ఖాయం చేసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడమే అభివృద్ధికి కొలమానం గా పరిగణిస్తూ ముందుకెళ్తోంది భూటాన్. దాని ఫలితంగానే ప్రపంచ కార్యాచరణ ప్రణాళికలో(అజెండా) లో ఆనందాన్ని కూడా చేర్చాలని నిరుడు జూలై లో ఐక్య రాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ఏకగ్రీవం గా తీర్మానించింది.  అది ఇప్పుడు అమలులోకి రావడంతో భూటాన్ దేశ వినూత్న ఆలోచనకు ప్రపంచ ఆమోదం లభించినట్లయింది.  ఐక్యరాజ్య సమితి 66 సమావేశంలో భాగంగా అనందంపై ఉన్నత స్థాయీ సదస్సు ను నిర్వహించే అవకాశం దీనితో భూటాన్ కి లభించింది. 

వేలెడంత లేని దేశం ప్రపంచ పెద్దలకే చెప్పడం  వినడానికి  ఆశ్చర్యంగా అనిపించినా పరిస్థితి ఎందుకు తలెత్తిందన్న ఆత్మ విమర్శ కావాలిప్పుడు.అనేక దేశాలు అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాలు ఏవో కొన్ని వర్గాలకే ప్రయోజనం చేకూరుస్తూ, అత్యధిక ప్రజానీకానికి ఆశాభంగం కలిగిస్తున్న నేపధ్యం లో అసలైన ఆనందానికి భూటాన్ అర్ధం చెపుతొంది.కాకి లెక్కలూ, కనికట్టులూ, గారడీ విద్యలతో ప్రజానీకాన్ని బురిడీ కొట్టించడమే గొప్పతనమని భావిస్తున్న ఆర్ధిక నిపుణులూ, మేధావులూ చిన్న దేశాన్నించి నేర్చుకోవలసిన పెద్ద పాఠాలు ఎన్నెన్నో..    

మ్యారీడ్ టు భూటాన్  పుస్తకంలో లిండా లీమింగ్ తాను భూటాన్ దేశానికి ఎందుకు ఆకర్షితురాలయ్యిందీ చెప్పే క్రమంలో,    దేశ సాంఘిక, సాంస్కృతిక, ఆర్ధిక పరిస్థితులను మనకుఅద్దంలా చూపిస్తారు.భూటాన్ ప్రజలు ఆనందం గా, ప్రశాంతం గా జీవించడానికి  ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారుఈప్పటికీ ఆ దేశం లొ చాలా మందికి ఇంటర్నెట్ పరిచయం లేదు. మన దేశం లో ఉన్నన్ని పుబ్ లు లేవు.. ఇన్ని సినిమా థియేటర్స్ లేవు..  ఐనా వాళ్ళు ఎంతో సంతోషం గా ఉంటారు. కుటుంబంతోస్నేహితులతో ఎక్కువ గా గడపడానికి ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణం. శీతకాలం లో పని గంటలు చాలా తక్కువగా ఉంటాయిఆ సమయం లో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా చాలా తక్కువఆ సమయం అంతా బౌద్ధ మత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా ప్రజలు పాలు పంచుకొంటారు.       

భూటాన్ రోడ్ల మీద కార్లు షికారు చెయ్యవు. ఇప్పటికీ ఎక్కువ శాతం గుర్రపు బళ్ళే కనబడతాయివేగవంతమైన జీవన విధానానికి అలవాటు పడిపోయిన మనకి " మ్యారీడ్ టు భూటాన్" చదువుతుంటే మొదట్లో భూటానీయుల జీవన విధానం మరీ స్థబ్దం గా నిస్సారం గా అనిపించవచ్చు. కాని చదువుతున్న కొద్దీమనం ఎంత ఆనందాన్ని కోల్పోతున్నామో అర్ధం అవుతుంది. పుస్తకం ముందు మాటలో రచయిత్రి ... అప్పటి బ్రిటిష్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ .. భూటాన్ గురించి అన్న మాటలు వ్రాస్తారు.      

                  
                   JUST AS ALICE, WHEN SHE WALKED THROUGH
                        THE LOOKING GLASS, FOUND HERSELF IN A NEW
                        AND WHIMSICAL WORLD, SO WE, WHEN WE
                        CROSSED OVER THE PA CHU, FOUND OURSELVES AS
                        THOUGH CAUGHT UP ON THE SAME MAGIC TIME MACHINE
                        FITTED FANTASTICALLY WITH A REVERSE....


ఫుస్తకం చదువుతుంటే మనకి కూడా ఒక అద్భుత ప్రపంచం లో విహరిస్తున్నట్లే ఉంటుంది. అలాంటి జీవితం కొన్నాళ్ళైనా గడపాలి అనిపిస్తుంది.    

No comments