మా బతుకులు – ఒక దళిత స్త్రీ ఆత్మకథ - బేబి కాంబ్లే

"మాకు నాలుగు కాళ్లు కాక
రెండే కాళ్లు వుండటం వల్ల మాత్రమే మమ్మల్ని మనుషులు అనవలసి వస్తోంది.
వాళ్ల పెరట్లో కట్టేసి వుంచే ఎద్దుల కంటే హీనమైన పరిస్థితికి మమ్మల్ని దిగజార్చారు.
కనీసం ఎద్దులకి ఎండుగడ్డయినా వేస్తారు.
మాకు మాత్రం ఎంగిలి మెతుకులే గతి.
అయితే తేడా ఏంటంటే ఎడ్లు కడుపునిండా తిని వాళ్ళ యజమానుల పెరటిలోనే వుంటాయి.
మేము ఉండేది ఊరవతల పెంటకుప్పల్లో.
అగ్రకులాలు ఆ పెంటకుప్పల మీదికి విసిరేసే చచ్చిన జంతువులకి మాత్రమే మేము యజమానులం.
ఆ జంతువుల చర్మాలని ఒలిచే హక్కుని నిలబెట్టుకోడానికి మేము కుక్కలతోటి, పిల్లులతోటీ, గెద్దలతోటీ, రాబందులతోటీ కొట్లాడాలి.
ప్రపంచం నిలబడి వుండటానికి కారణం మాత్రం మేమే.
పర్వతాలను సైతం తనలో దాచుకోగలిగే అనంత సముద్రం లాగా అగ్రకుల పాపాల పర్వతాలను కప్పి వుంచే సముదాల్ర వంటి వారం మేము.
అందుకే సముద్రానికి దక్కినట్టే ప్రపంచపు మొత్తం ఆరాధన మాకు దక్కాలి!"
- బేబి కాంబ్లే
(ఈ పుస్తక రచయిత్రి)

కన్నీళ్ళు ఆగట్లేదు కదూ... ఆగవు. ఒక దళిత మహిళ ఆత్మకథ ఇది. ఆమె జీవిత అనుభవాలు ఇవి. మూడు తరాల దళిత మహర్ మహిలలాల్ బ్రతుకు పోరాట చిత్రం ‘ మా బతుకులు’

బాబా సాహెబ్ అంబేద్కర్ నడపిన చారిత్రాత్మక దళిత ఉద్యమంలో తొలి తరం మహిళా కార్యకర్త బేబి కాంబ్లే ఎప్పుడో 1962 లో రాసిన ఆమె ఆత్మకథ 2008 లో The Prisons We Broke గా ఇంగ్లీష్ లో వచ్చింది. ఒక సాధారణ దళిత మహిళ అనుభవాలు ఆలోచనలూ వెలుగులోకి రావటం ఎంత కష్టమో ‘మా బతుకులు’ పుస్తకం చదివితే అర్థం అవుతుంది
 దళితుల ఆమూహిక దృశ్యాన్ని, సమాజంలోని అసమానతల రూపాన్ని చిత్రించే నవలలు, ఆత్మ కథలూ చాలానే వచ్చాయి. అన్ని కథలూ అగ్రకుల సమాజపు దౌర్జన్యాన్ని, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ సమాజ మార్పుని కోరతాయి. అయితే ఆ పుస్తకాలకీ ‘మా బతుకులు’ పుస్తకానికి చాలా తేడా ఉంది.
‘మా బతుకులు’ ఒక దళిత మహిళ దృష్టి కోణం నుంచి దళిత మహిళల జీవితం కేంద్రంగా దళిత జీవితాన్ని... మొత్తంగా సమాజపు స్వభావాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుందీ పుస్తకం. అగ్రకుల ఆధిపత్యంపై విశ్లేషణతో పాటు, దళిత సమాజంలో ఉన్న అసమానతల్ని, వివక్షా రూపాన్ని, హింసనీ సమగ్రంగా చిత్రిస్తూ మనసుని కుదిపేటట్లు చూపించడం ఈ పుస్తకం ప్రత్యేకత.

ఈ పుస్తకంలో మహారాష్ట్రలో అంటరాని కులస్తులైన మహర్ల జీవితాలని ప్రధానంగా రెండు భాగాలుగా విభజించి చూపించారు. మొదటి భాగంలో మహర్ల సాంప్రదాయక సంస్కృతి జీవితం రెండవ భాగంలో అంబేద్కర్ ఉద్యమ వెలుగులో మహార్లు ఆధునికత వైపు అడుగులు వేయడం వర్ణింపబడినది. పేదరికం, అంటరానితనం, అజ్ఞానంలో బ్రతుకుతున్న మహర్లు అంబేద్కర్ ఆలోచనలకీ ఉద్యమానికీ ఆకర్షితులై చైతన్య వంతులుగా ఎదిగి మానవ మర్యాద, ఆత్మగౌరవం సాధించుకున్న తీరు ‘మా బతుకులు’ ఇతివృత్తం.
మహారాష్ట్రలో పోనా సమీపంలోనీ వీర్ గావ్ గ్రామం లో పుట్టింది బేబీ కాంబ్లే. అంటరానితనం, కుల వివక్ష, పేదరికంతో దుర్భర జీవితం గడుపుతూ ఉంటారు మహర్లు. తరతరాలుగా వాళ్ళపై రుద్దబడ్డ బ్రాహ్మణీయ భావజాలం వల్ల మహర్లు తమకు తెలియకుండా తాము ఒక విధమైన భావ దాస్యంలోకి నెట్టివేయబడతారు.



హిందూ సంప్రదాయాలని అరకొరగా ఆచరిస్తూ, అగ్రకులాలని అనుసరించడంలో మహర్లు చూపించే అజ్ఞానం, ఆ అజ్ఞానానికి పేదరికం తోడయ్యి తమని తాము తక్కువ వారిగా బానిసలుగా భావించుకునే స్థితిని రచయిత చక్కగా చూపించారు.
మహర్ కులంలో అమ్మాయిలకి బాల్య వివాహాలు జరుగుతాయి. శారీరకంగా ఎదగాకముందే తల్లులవడం, మంత్రసానుల నాటు పద్ధతుల వల్ల చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంటుంది.



ఇదంతా ఒక ఎత్తయితే మహిళల పట్ల కుటుంబంలో పురుషుల హింస మరొక ఎత్తు. అగ్రకుల వివక్షకు గురై డిప్రెషన్ లో ఉన్న మహర్ పురుషులు తమ భావజాలాన్ని రుద్దడానికి, తమ కాంప్లెక్స్ ని దూరం చేసుకోవడానికి స్త్రీలని ఎలా బలిచేస్తున్నారో చాలా బాగా వ్యక్తం చెయ్యబడింది ఈ పుస్తకంలో.



మహర్ జీవిత చిత్రణలో తన జ్ఞాపకాలని అనేక దృశ్యాలుగా, వివరమైన వర్ణనలతో చూపించారు బేబి కాంబ్లే. సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు గురించి, పెళ్ళిళ్ళలో మిగిలిన ఆహారం తినడం, చచ్చిన గొడ్డు మాంసాన్ని దాచుకుని రోజుల తరబడి తినడం, ఆకలితో చావలేక బ్రహ్మ జెముడు కాయలు తిని బ్రతకడం చదువుతుంటే మనసు కన్నీళ్ళ సముద్రమై గుండెను ముంచేస్తున్న భావన కలుగుతుంది.



‘అప్పటిదాకా జంతువులుగా బ్రతికిన మమ్మల్ని అంబేద్కర్ మనుషులుగా మార్చారు.’ అంటారు బేబి కాంబ్లే. ఈ పుస్తకంలో అంబేద్కర్ ఒక పాత్రగా, స్ఫూర్తి ప్రతీకగా కనిపిస్తారు. 1940లలో అంబేద్కర్ చేసిన ఒక ప్రసంగం మహర్ కులస్తులలో రేపిన దుమారం... మెల్లగా వాళ్ళలో వచ్చిన మార్పు... మహార్లు చదువుకోవడం, అంబేద్కర్ జయంతి నాడు తెల్లని బట్టలు ధరించి ఆత్మగౌరవంతో నడుస్తూ కొత్తమనుషుల్లా మహార్లు కనిపించడంతో ఈ పుస్తకం ముగుస్తుంది. పుస్తకం చివర్లో చదువుకున్న దళితులు స్వార్థంతో జాతిని విచ్చిన్నం చేస్తున్నారని... అంబేద్కర్ ఆశించింది ఇదేనా అని బేబి కాంబ్లే ప్రశ్నిస్తుంది.



‘మా బ్రతుకులు’ పుస్తకం అంతా అప్పటి దళితుల మనసులలో అంతర్భాగమైన అజ్ఞానం, న్యూనతా భావం, భావ దాస్యం... ఇత్యాది సమాజ రుగ్మతలని సమూలంగా తొలగించడానికి అంబేద్కర్ చేసిన కృషిని కళ్ళకు కట్టినట్లు చెప్తారు బేబి కాంబ్లే. అగ్రకులాలు దళితుల్ని ఎలా అణచి వేస్తున్నాయో చెప్తారు కానీ దానికన్నా ప్రధానంగా తమ భావజాల బానిసత్వం ఎలా తొలగించుకోవాలో అన్నదే ముఖ్యం అంటారు రచయిత్రి.



1982లో ఒక మరాఠీ స్త్రీవాద పత్రికలో ధారావాహికగా ఈ పుస్తకం ప్రచురింపబడినప్పుడు అది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగులో అనురాధ గారు చేసిన అనువాదం సరళంగా అత్యంత సహజంగా ఉంది.



చివరగా ఒక్క మాట... ఈ పుస్తకంలోకి వెళ్లేముందు మనసు లోని అన్నివాదాలని తుడిచేసుకుని ఒక తెల్ల కాగితంలా వెళ్ళండి. మీరు చదివేది మనలాంటి మనుషుల కథే అని మాత్రం గుర్తించుకోండి. అంతా అయ్యాక కంటి చివర ఒక్క కన్నీటి బొట్టు వేళ్ళాడటమే సాక్ష్యమవుతుంది మనమింకా మనుషులుగా కొనసాగవచ్చు అని చెప్పడానికి.






No comments